Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యోహాను - యోహాను 11

యోహాను 11:6-49

Help us?
Click on verse(s) to share them!
6లాజరు జబ్బు పడ్డాడని యేసు విని కూడా తాను ఉన్న చోటనే ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు.
7దాని తరువాత ఆయన తన శిష్యులతో, “మనం మళ్ళీ యూదయకు వెళ్దాం పదండి” అన్నాడు.
8ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ, ఇంతకు ముందే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టే ప్రయత్నం చేశారు కదా, అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అన్నారు.
9అందుకు యేసు జవాబిస్తూ, “పగలు పన్నెండు గంటల వెలుగు ఉండదా? ఒకడు పగటి వేళ నడిస్తే తడబడడు. ఎందుకంటే అతడు వెలుగులో అన్నీ చూస్తాడు.
10అయితే ఒకడు రాత్రివేళ నడిస్తే అతనిలో వెలుగు లేదు కాబట్టి తడబడతాడు” అని చెప్పాడు.
11యేసు ఈ సంగతులు చెప్పిన తరువాత వారితో ఇలా అన్నాడు, “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతన్ని నిద్ర లేపడానికి వెళ్తున్నాను.”
12అందుకు శిష్యులు ఆయనతో, “ప్రభూ, అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు” అన్నారు.
13యేసు అతని చావు గురించి మాట్లాడాడు గాని వారు నిద్రలో విశ్రాంతి తీసుకోవడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు.
14అప్పుడు యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
15నేను అక్కడ లేకపోవడాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఇది మీ కోసమే. మీకు నమ్మకం కలగడానికే. అతని దగ్గరకి వెళ్దాం పదండి” అన్నాడు.
16దిదుమ అనే మారుపేరున్న తోమా, “యేసుతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం పదండి” అని తన తోటి శిష్యులతో అన్నాడు.
17యేసు అక్కడికి చేరుకుని, అప్పటికే నాలుగు రోజులుగా లాజరు సమాధిలో ఉన్నాడని తెలుసుకున్నాడు.
18బేతనియ యెరూషలేముకు దగ్గరే. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
19చాలామంది యూదులు మార్త, మరియలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి వచ్చి, అక్కడ ఉన్నారు.
20అప్పుడు మార్త, యేసు వస్తున్నాడని విని ఆయనను ఎదుర్కోడానికి వెళ్ళింది గాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
21అప్పుడు మార్త యేసుతో, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు,
22ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు” అంది.
23యేసు ఆమెతో, “నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు” అన్నాడు.
24మార్త ఆయనతో, “చివరి రోజున పునరుత్థానంలో బతికి లేస్తాడని నాకు తెలుసు” అంది.
25అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు,
26బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?” అన్నాడు.
27ఆమె, “అవును ప్రభూ, నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది.
28ఈ మాట చెప్పిన తరువాత ఆమె వెళ్ళి ఎవరికీ తెలియకుండా తన సోదరి మరియను పిలిచి, “బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు” అంది.
29మరియ అది విన్నప్పుడు, త్వరగా లేచి యేసు దగ్గరికి వెళ్ళింది.
30యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్తను కలుసుకున్న చోటే ఉన్నాడు.
31మరియతో ఇంట్లో ఉండి ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్ళడం చూసి ఆమె వెంట వెళ్ళారు. ఆమె ఏడవడానికి సమాధి దగ్గరికి వెళ్తూ ఉందని వారు అనుకున్నారు.
32అప్పుడు మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూసి ఆయన కాళ్ళ మీద పడి, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు” అంది.
33ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, “అతణ్ణి ఎక్కడ పెట్టారు?” అన్నాడు.
34వారు, “ప్రభూ, వచ్చి చూడు” అన్నారు.
35యేసు ఏడ్చాడు.
36అప్పుడు యూదులు, “ఆయన లాజరును ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు.
37వారిలో కొంతమంది, “ఆయన గుడ్డివారి కళ్ళు తెరిచాడు కదా, ఇతను చనిపోకుండా చెయ్యలేడా?” అన్నారు.
38యేసు తనలో తాను మూలుగుతూ ఆ సమాధి గుహ దగ్గరికి వెళ్ళాడు. ఒక రాయి దానికి అడ్డంగా నిలబెట్టి ఉంది.
39యేసు, “ఆ రాయి తీసి వెయ్యండి” అన్నాడు. చనిపోయిన లాజరు సోదరి మార్త యేసుతో, “ప్రభూ, ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది” అంది.
40యేసు ఆమెతో, “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నాడు.
41కాబట్టి వారు ఆ రాయి తీసి వేశారు. యేసు పైకి చూస్తూ, “తండ్రీ, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు.
42నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ వింటావని నాకు తెలుసు. కాని, నా చుట్టూ నిలుచుని ఉన్న ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాట పలికాను” అన్నాడు.
43ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, “లాజరూ, బయటికి రా!” అన్నాడు.
44అప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వారితో, “అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి” అన్నాడు.
45అప్పుడు మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయనను నమ్మారు.
46కాని, వారిలో కొంతమంది వెళ్ళి యేసు చేసిన పనులు పరిసయ్యులకు చెప్పారు.
47అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరిచి, “మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే,
48మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకుపోతారు” అన్నారు.
49అయితే, వారిలో ఒకడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కయప వారితో, “మీకేమీ తెలియదు.

Read యోహాను 11యోహాను 11
Compare యోహాను 11:6-49యోహాను 11:6-49