Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యెహెజ్కేలు

యెహెజ్కేలు 46

Help us?
Click on verse(s) to share them!
1ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “తూర్పు వైపు తిరిగి ఉన్న లోపటి ఆవరణద్వారం ఆరు పని దినాలు మూసి ఉంచి, విశ్రాంతి రోజున, అమావాస్య రోజున తెరవాలి.
2పాలకుడు బయటి వసారా గుమ్మం గుండా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధాల దగ్గర నిలబడినప్పుడు, యాజకులు దహనబలి పశువులను, సమాధానబలి పశువులను అతని కోసం సిద్ధపరచాలి. అతడు గుమ్మం దగ్గర నిలబడి ఆరాధన చేసిన తరవాత బయటికి వెళ్తాడు. అయితే సాయంకాలం కాక ముందే ఆ గుమ్మం మూయకూడదు.
3విశ్రాంతిదినాల్లో, అమావాస్యల్లో దేశప్రజలు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయాలి.
4విశ్రాంతి దినాన పాలకుడు యెహోవాకు ఏ లోపం లేని ఆరు గొర్రె పిల్లలు, ఏ లోపం లేని ఒక పొట్టేలును దహనబలిగా అర్పించాలి.
5పొట్టేలుతో 22 లీటర్ల పిండితో నైవేద్యం చేయాలి. గొర్రెపిల్లలతో తన శక్తికొలది నైవేద్యాన్ని, ప్రతి 22 లీటర్ల పిండికి ఒక లీటర్ నూనె తేవాలి.
6అమావాస్య రోజున ఏ లోపం లేని చిన్న కోడెను, ఏ లోపం లేని ఆరు గొర్రె పిల్లలనూ, ఏ లోపం లేని ఒక పొట్టేలును అర్పించాలి.
7నైవేద్యాన్ని సిద్ధపరచాలి, ఎద్దుతో, పొట్టేలుతో, 22 లీటర్లు, గొర్రెపిల్లలతో శక్తికొలదిగా పిండిని అర్పించాలి. ప్రతి 22 లీటర్ల పిండికి ఒక లీటర్ నూనె తేవాలి.
8పాలకుడు ప్రవేశించేటప్పుడు వసారా మార్గం గుండా ప్రవేశించి అదే మార్గంలో బయటికి వెళ్ళాలి.
9అయితే నియమిత సమయాల్లో దేశ ప్రజలు యెహోవా సన్నిధిలో ఆరాధించడానికి వచ్చినప్పుడు ఉత్తర గుమ్మం గుండా వచ్చినవారు దక్షిణ గుమ్మం గుండా వెళ్ళాలి. దక్షిణ గుమ్మం గుండా వచ్చినవారు ఉత్తర గుమ్మం గుండా వెళ్ళాలి. ఎవరూ తాము వచ్చిన గుమ్మం గుండా తిరిగి వెళ్ళకుండా అందరూ తిన్నగా బయటికి వెళ్లిపోవాలి.
10పాలకుడు వారితో కలిసి ప్రవేశించాలి, వారితో కలిసి బయటికి వెళ్ళాలి.
11పండగ రోజుల్లో, నియమిత సమయాల్లో ఎద్దుతో, పొట్టేలుతో అయితే 22 లీటర్లు పిండి, గొర్రెపిల్లలతో శక్తి మేరకు పిండిని, ప్రతి 22 లీటర్ల పిండితో ఒక లీటర్ నూనె, నైవేద్యంగా అర్పించాలి.
12పాలకుడు యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి గాని, సమాధానబలి గాని అర్పించేటప్పుడు తూర్పు వైపు గుమ్మం తెరవాలి. విశ్రాంతి దినాన చేసినట్టే అతడు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవాలి. అతడు వెళ్లిన తరవాత గుమ్మం మూయాలి.
13ప్రతి రోజు ఏ లోపం లేని ఒక సంవత్సరం వయసున్న మగ గొర్రెపిల్లను దహనబలిగా అర్పించాలి. ప్రతి రోజు ఉదయాన దాన్ని అర్పించి దానితో నైవేద్యం చేయాలి.
14అది ఎలాగంటే, 22 లీటర్ల గోదుమ పిండిలో ఆరో వంతు, దాన్ని కలపడానికి ఒక లీటరు నూనె ఉండాలి. ఇవి ఎవరూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు.
15గొర్రెపిల్లలను, నైవేద్యాన్ని, నూనెను ప్రతి రోజు ఉదయాన్నే నిత్య దహనబలిగా అర్పించాలి.
16ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, పాలకుడు తన కొడుకుల్లో ఎవరికైనా భూమిని ఇస్తే అది అతని స్వాస్థ్యం అవుతుంది. అది వారసత్వం వలన వచ్చిన స్వాస్థ్యం లాంటిది.
17అయితే అతడు తన పనివారిలో ఎవరికైనా భూమి ఇస్తే అది విడుదల సంవత్సరం వరకే అది అతనికి హక్కుగా ఉంది తరువాత పాలకునికి తిరిగి వస్తుంది. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యానికి హక్కుదారులవుతారు.
18ప్రజలు తమ స్వాస్థ్యాలను అనుభవించనీయకుండా పాలకుడు వారి భూమిని ఆక్రమించకూడదు. నా ప్రజలు తమ భూములను విడిచి చెదరిపోకుండేలా అతడు తన స్వంత భూమిలోనుండి తన కొడుకులకు భాగాలు ఇవ్వాలి.”

19ఆ తరవాత ఆయన గుమ్మపు మధ్యగోడ మార్గంలో ఉత్తరం వైపుకు తిరిగి ఉన్న యాజకులకు ఏర్పాటు చేసిన పవిత్రమైన గదుల్లోకి నన్ను తీసుకువచ్చాడు. అక్కడ వెనక వైపు పశ్చిమదిక్కున ఒక స్థలం నాకు కనిపించింది.
20యాజకులు అపరాధ పరిహారార్థ బలి పశుమాంసాన్ని, పాప పరిహారార్థ బలి పశుమాంసాన్ని వండి, నైవేద్యాలను కాల్చే స్థలం ఇదే. వారు ఆ పవిత్రమైన వస్తువులను బయటి ఆవరణంలోకి తెస్తే ప్రజల్లో ఎవరైనా వాటిని తాకి ప్రతిష్ఠితులవుతారు కాబట్టి వాటిని బయటికి తేకూడదు, అని ఆయన నాతో చెప్పాడు.
21అతడు బయటి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి ఆవరణపు నాలుగు మూలలను తిప్పాడు. ఆవరణం ప్రతి మూలలో మరొక ఆవరణం ఉన్నట్టు నాకు కనబడింది.
22ఆవరణం నాలుగు మూలల్లో ఒక్కొక్క ఆవరణం ఉంది. ఒక్కొక్కటి 22 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉండి, నాలుగూ ఒకే పరిమాణంలో ఉన్నాయి.
23ఆ నాలుగింటిలో చుట్టూ వరుసలో ఉన్న అటకలున్నాయి. ఆ అటకల కింద పొయ్యిలున్నాయి.
24“ఇది వంట చేసేవారి స్థలం, ఇక్కడ మందిర పరిచారకులు ప్రజలు తెచ్చే బలిపశుమాంసాన్ని వండుతారు” అని ఆయన నాతో చెప్పాడు.