Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - న్యాయా

న్యాయా 1

Help us?
Click on verse(s) to share them!
1యెహోషువ చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చెయ్యడానికి తమలో ఎవరు ముందుగా వాళ్ళ మీదికి వెళ్ళాలో యెహోవా తమకు తెలపాలని ప్రార్థన చేశారు.
2యెహోవా “ఆ దేశాన్ని యూదాజాతి వారికి ఇచ్చాను, వాళ్ళే ముందు వెళ్ళాలి” అని చెప్పాడు.
3అప్పుడు యూదా జాతి వాళ్ళు తమ సహోదరులైన షిమ్యోను జాతివారితో “మనం కనానీయులతో యుద్ధం చెయ్యడానికి మా వాటా భూమిలోకి మాతో కలిసి రండి, మేము కూడా మీతో కలిసి మీ వాటా భూమిలోకి వస్తాం” అని చెప్పారు. షిమ్యోనీయులు వాళ్ళతో కలిసి వెళ్ళారు.
4కనానీయుల మీదికి యూదావారు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారికి అప్పగించాడు గనుక వాళ్ళు బెజెకు ప్రాంతంలో పదివేలమందిని హతం చేశారు.
5వాళ్ళు బెజెకు దగ్గర అదోనీ రాజు బెజెకును చూసి అతనితో యుద్ధం చేసి కనానీయులను, పెరిజ్జీయులను, హతం చేశారు.
6అదోనీ బెజెకు పారిపోయినప్పుడు వాళ్ళు అతణ్ణి తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోసేశారు
7అప్పుడు అదోనీ బెజెకు “ఇలా కాళ్లు, చేతుల బొటన వేళ్ళు కోసిన డెభ్భైమంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకోనేవాళ్ళు. నేను చేసినదానికి దేవుడు నాకు ప్రతిఫలమిచ్చాడు” అన్నాడు. వాళ్ళు అతణ్ణి యెరూషలేముకు తీసుకొచ్చారు. అతడు అక్కడ చనిపోయాడు.
8యూదావంశం వారు యెరూషలేముపై కూడా యుద్ధం చేసి దాన్ని పట్టుకుని కొల్లగొట్టి ఆ పట్టణాన్ని కాల్చివేశారు.
9తరువాత యూదా వంశంవారు అరణ్య ప్రాంతాల్లో, దక్షిణదేశంలో లోయలో ఉన్న కనానీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు.
10ఇంకా యూదా వంశం వారు హెబ్రోనులో ఉన్న కనానీయుల మీదికి వెళ్లి, షేషయిని, అహీమానుని, తల్మయిని హతం చేశారు.
11వారు హెబ్రోనులొ ఉండి దెబీరులో నివాసం ఉంటున్న వాళ్ళ మీదికి యుద్ధానికి వెళ్ళారు. హెబ్రోనుకు అంతకుముందు పేరు కిర్యతర్బా. అక్కడ షేషయి, ఆహీమాను, తల్మయి అనే వాళ్ళని హతమార్చారు. అక్కడినుండి వారు దెబీరులో కాపురం ఉంటున్నవారిని హతమార్చారు. దెబీరును పూర్వం కిర్యత్ సేఫెరు అనే వారు.
12“కిర్యత్ సేఫెరును కొల్లగొట్టిన వాడికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను” అని కాలేబు ప్రకటించినప్పుడు
13కాలేబు తమ్ముడు కనజు కొడుకు ఒత్నీయేలు దాన్ని పట్టుకున్నాడు గనుక కాలేబు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసాడు.
14ఆమె తన భర్త ఇంటికి వచ్చాక తన తండ్రిని కొంత పొలం అడగమని అతణ్ణి ప్రేరేపించింది. ఆమె గాడిద దిగినప్పుడు కాలేబు “నీకేం కావాలి?” అని అడిగాడు.
15అందుకు ఆమె “నాకు దీవెన ఇవ్వు. నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నీటి మడుగులు కూడా నాకు ఇవ్వు” అంది. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులు, పల్లపు మడుగులు ఇచ్చాడు.
16మోషే మామ అయిన కేయిను వారసులు యూదావంశం వారితో కలిసి ఖర్జూరచెట్ల పట్టణంలోనుంచి అరాదుకు దక్షిణంవైపు ఉన్న యూదా అరణ్యానికి వెళ్లి అక్కడ ఆ జనంతో కలిసి నివసించారు.
17యూదావంశం వారు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కలిసి వెళ్లి జెఫతులో ఉంటున్న కనానీయులను హతం చేసి ఆ పట్టణాన్ని నాశనం చేసి, ఆ పట్టణానికి హోర్మా అనే పేరు పెట్టారు.
18యూదావంశం వారు గాజాను, దాని ప్రాంతాన్ని, అష్కెలోనును దాని ప్రాంతాన్ని, ఎక్రోనును దాని ప్రాంతాన్ని ఆక్రమించారు.
19యెహోవా యూదావంశం వారికి తోడుగా ఉన్నాడు కనుక వాళ్ళు కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మైదాన ప్రాంతాల్లో ఉంటున్నవాళ్లకు ఇనుప రథాలు ఉన్న కారణంగా వాళ్ళను తరిమివేయలేక పోయారు.
20మోషే మాట ప్రకారం హెబ్రోనును కాలేబుకు ఇచ్చినప్పుడు, అతడు ముగ్గురు అనాకు వంశీకులను అక్కడనుంచి పారద్రోలి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
21కాని, బెన్యామీనీయులు యెరూషలేములో ఉంటున్న యెబూసీయులను వెళ్లగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో నేటివరకూ యెరూషలేములో కలిసి నివసిస్తున్నారు.
22యోసేపు సంతతివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.
23పూర్వకాలంలో లూజు అనే పేరుగల బేతేలును వేగు చూడడానికి యోసేపు గోత్రికులు దూతలను పంపినప్పుడు
24ఆ గూఢచారులు, ఆ పట్టణంలోనుంచి ఒకడు రావడం చూసి “దయచేసి ఈ పట్టణంలోకి వెళ్ళే దారి మాకు చూపిస్తే మేము నీకు ఉపకారం చేస్తాం” అని చెప్పారు.
25అతడు ఆ పట్టణంలోకి వెళ్ళే దారి వాళ్లకు చూపించినప్పుడు, వాళ్ళు ఆ పట్టణంలోని వారిని కత్తివాత హతం చేశారు. అయితే, ఆ వ్యక్తిని, అతని కుటుంబంలోని వాళ్ళందరినీ వదిలేశారు.
26ఆ వ్యక్తి, హిత్తీయ దేశానికి వెళ్లి ఒక పట్టణం కట్టించి దానికి లూజు అనే పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ దాని పేరు అదే.
27మనష్షె గోత్రంవారు బేత్షెయానును, తయినాకును, దోరును, ఇబ్లెయామును, మెగిద్దో పట్టణాలను, వాటి పల్లెలను వశం చేసుకోలేదు. ఎందుకంటే కనానీయులు ఆ ప్రదేశంలోనే ఉండాలని తెగించి పోరాడారు.
28ఇశ్రాయేలీయులు బలం పుంజుకున్న తరువాత కనానీయులతో వెట్టిపనులు చేయించుకున్నారు గాని వాళ్ళను పూర్తిగా వెళ్ళగొట్టలేదు.
29ఎఫ్రాయిమీయులు గెజెరులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు. గెజెరులో కనానీయులు వాళ్ళ మధ్యే నివాసం ఉన్నారు.
30జెబూలూనీయులు కిత్రోనులో ఉన్నవాళ్ళను, నహలోలు నివాసులను వెళ్లగొట్ట లేదు. కనానీయులు వారి మధ్యే ఉంటూ వాళ్లకు వెట్టిపనులు చేసేవాళ్ళుగా ఉన్నారు.
31ఆషేరీయులు అక్కోలో ఉన్నవాళ్ళను, సీదోనులో ఉన్నవాళ్ళను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, హెల్బావారిని, అఫెకు వారిని, రెహోబు వారిని,
32ఆ ప్రదేశంలో ఉన్న కనానీయులను వెళ్లగొట్టకుండా వాళ్ళ మధ్యనే నివాసం ఉండనిచ్చారు. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని బేతనాతు వారిని వెళ్లగొట్ట లేదు,
33బేత్షెమెషులో ఉన్న వాళ్ళ చేత, బేతనాతులో ఉన్నవాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకున్నారు.
34అమోరీయులు దానీయులను మైదాన ప్రాంతానికి రానివ్వకుండా కొండ ప్రదేశానికి వెళ్ళగొట్టారు.
35అమోరీయులు హెరేసు కొండలో అయ్యాలోనులో, షయల్బీములో నివాసం ఉండాలని గట్టి పట్టు పట్టినప్పుడు యోసేపు గోత్రికులు బలవంతులు గనుక వాళ్ళ చేత వెట్టిపనులు చేయించుకున్నారు.
36అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకుని హస్సెలా వరకూ వ్యాపించింది.