28అప్పుడు షోమ్రోనులోనుంచి వారు పట్టుకు వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊళ్ళో కాపురం ఉండి యెహోవా పట్ల భయభక్తులుగా ఉండవలసిన విధానాన్ని వాళ్లకు బోధించాడు.
29అయితే కొంతమంది ప్రజలు తమ సొంత దేవుళ్ళను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకొన్న ఉన్నత స్థలాల మందిరాల్లో వాటిని ఉంచుకున్నారు. ఇంకా, వారు తమ తమ పట్టణాల్లో తమ కోసం దేవుళ్ళను తయారు చేసుకున్నారు.
30బబులోను వారు సుక్కో తు బెనోతు దేవుణ్ణి, కూతా వారు నెర్గలు దేవుణ్ణి, హమాతు వారు అషీమా దేవుణ్ణి,
31ఆవీయులు నిబ్హజు దేవుణ్ణి, తర్తాకు దేవుణ్ణి, ఎవరి దేవుళ్ళను వారు పెట్టుకుంటూ ఉన్నారు. సెపర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు, అనెమ్మెలెకు అనే సెపర్వయీము దేవుళ్ళకు అగ్నిలో బలిగా అర్పిస్తూ ఉన్నారు.
32ఆ ప్రజలు యెహోవాను కూడా పూజించారు. ఉన్నత స్థలాల్లో సామాన్యుల్లో కొంతమందిని యాజకులుగా చేసుకున్నారు. అ యాజకులు ప్రజల పక్షంగా ఆ ఉన్నత స్థలాల్లో కట్టిన మందిరాల్లో బలులు అర్పిస్తూ ఉన్నారు.
33ఈ విధంగా వారు యెహోవా పట్ల భయభక్తులు చూపుతూనే, తాము ఏ ప్రజల్లో నుంచి వచ్చారో ఆ ప్రజల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా పూజిస్తూ ఉన్నారు.
34ఈ రోజు వరకూ తమ పూర్వాచారాల ప్రకారం వారు చేస్తున్నారు. ఇశ్రాయేలు అని పేరు పెట్టిన యాకోబు సంతానం, యెహోవా పట్ల భయభక్తులు చూపలేదు. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని, విధులు గాని, ధర్మశాస్త్రం గాని, ఆజ్ఞల్లో దేనినీ గానీ అనుసరించలేదు.