9అలాగని అతనిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు తెలివైన వాడివి కాబట్టి అతణ్ణి ఏమి చెయ్యాలో అది నీకు తెలుసు. వాడి నెరసిన తలను రక్తంతో సమాధిలోకి వెళ్ళేలా చెయ్యి.”
10ఆ తరవాత దావీదు చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో సమాధి చేశారు.
11దావీదు ఇశ్రాయేలీయులను పాలించిన కాలం 40 సంవత్సరాలు. అతడు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పాలించాడు.
12అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని రాజ్యం సుస్థిరం అయింది.
13అప్పుడు హగ్గీతు కొడుకు అదోనీయా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చాడు. ఆమె “శాంతంగా వస్తున్నావా?” అని అతణ్ణి అడిగింది. అతడు “శాంతంగానే వస్తున్నాను” అని చెప్పి,
14తరువాత అతడు “నీతో చెప్పాల్సిన మాట ఒకటి ఉంది” అన్నాడు. ఆమె “ఏమిటో చెప్పు” అంది.
15అతడు “రాజ్యం నిజానికి నాదే అనీ, నేను వారిని పరిపాలిస్తాననీ ఇశ్రాయేలీయులందరూ నేనే రాజునౌతానని చూశారు. అయితే అలా జరక్కుండా రాజ్యం నా సోదరునికి దక్కింది. అది యెహోవా సంకల్పం వలన అతనిది అయింది.
16ఇప్పుడు నాదొక మనవి. కాదనవద్దు” అన్నాడు.
17ఆమె “చెప్పు” అంది. అతడు “షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని దయచేసి నీవు సొలొమోనుతో చెప్పాలి. నీవు చెబితే అతడు కాదనడు” అన్నాడు.
18బత్షెబ “మంచిది, నేను రాజుతో మాట్లాడుతాను” అంది.
19బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకి అదోనీయా తరపున మాట్లాడటానికి వెళ్ళింది. రాజు లేచి ఆమెకు ఎదురు వచ్చి నమస్కారం చేశాడు. అతడు తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కోసం ఒక ఆసనం వేయించాడు. ఆమె అతని కుడి పక్కన కూర్చుంది.
20ఆమె అతనితో “నాదొక చిన్న కోరిక. నా మాట కాదనవద్దు” అంది. రాజు “అమ్మా, చెప్పు. నీ మాట కాదనను” అన్నాడు.
21అప్పుడామె “నీ అన్న అదోనీయాకి షూనేమీయురాలైన అబీషగుని పెళ్లాడనీ” అంది.