17యెహోవా మోషేతో మళ్ళీ మాట్లాడుతూ “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు,
18నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత
19మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు యెహోవాకు ప్రతిష్ట అర్పణ అర్పించాలి.
20మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్టార్పణగా అర్పించాలి. కళ్లపు అర్పణలా దాన్ని అర్పించాలి.
21మీ తరతరాలకు మీ మొదటి పిండిముద్దలోనుంచి ప్రతిష్ఠార్పణను యెహోవాకు అర్పించాలి” అన్నాడు.
22“యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిట్లో, అంటే
23యెహోవా ఆజ్ఞాపించిన రోజు మొదలుకుని ఆ తరువాత మీ తరతరాలకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చెయ్యనప్పుడు, అది సమాజానికి తెలియజేస్తే,
24సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండడానికి దహనబలిగా ఒక లేత దున్నపోతును ఆజ్ఞప్రకారం దాని నైవేద్యాన్ని, దాని పానీయార్పణను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధం చెయ్యాలి.
25యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. తెలియక దాన్ని చేశారు గనక క్షమాపణ దొరుకుతుంది. వారు పొరపాటున చేసిన పాపాలను బట్టి తమ అర్పణ, అంటే యెహోవాకు చెందవలసిన దహనబలి, పాపపరిహారార్థబలి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి.
26అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజానికి గాని, వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశికి గాని, క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే, ప్రజలందరూ తెలియక దాన్ని చెయ్యడం జరిగింది.
27ఒకడు పొరపాటున పాపం చేస్తే, అతడు పాపపరిహారార్థ బలిగా ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఆడమేక పిల్లను తీసుకురావాలి.
28పొరపాటుగా యెహోవా సన్నిధిలో దాన్ని చేశాడు గనక తెలియక పాపం చేసిన అతని కోసం యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతని కోసం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల అతడు క్షమాపణ పొందుతాడు.
29ఇశ్రాయేలీయుల్లో పుట్టినవాడు గాని వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశి గాని పొరపాటున ఎవరైనా పాపం చేస్తే, అతనికీ, మీకూ ఒక్కటే చట్టం ఉండాలి.
30కాని, దేశంలో పుట్టినవాడు గాని పరదేశి గాని ఎవరైనా కావాలని పాపం చేస్తే,
31అతడు యెహోవాను తృణీకరించిన వాడు గనక అలాంటి వాడు కచ్చితంగా ప్రజల్లో ఉండకుండాా కొట్టివేయాలి. అతని పాపం అతని మీద ఉంటుంది. అతడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా అతడు తన ప్రజల్లో లేకుండా పోతాడు” అన్నాడు.
32ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరడం గమనించారు.
33అతడు కట్టెలు ఏరడం చూసిన వారు మోషే అహారోనుల దగ్గరికి, సమాజం ఎదుటికి అతన్ని తీసుకొచ్చారు.
34అతని పట్ల ఏం చెయ్యాలో అది వాళ్లకు తెలియ లేదు గనక అతన్ని అదుపులోకి తీసుకుని ఉంచారు.
35తరువాత యెహోవా మోషేతో “ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించాలి.
36సర్వసమాజం శిబిరం బయట అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి” అన్నాడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం శిబిరం బయటకు అతన్ని తీసుకెళ్ళి, రాళ్లతో కొట్టి చంపారు.
37ఇంకా యెహోవా మోషేతో మాట్లాడుతూ,
38“నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, వారు తమ తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని, అంచుల కుచ్చుల మీద నీలిరంగు దారం తగిలించాలి.
39మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండేలా ఇదివరకు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి.
40మీరు నా కోసం ప్రత్యేకపరచిన వారు గనక, మీరు పవిత్రులుగా ఉండేందుకు యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించడానికి జాగ్రత్త తీసుకోండి.
41నేను మీకు దేవుడుగా ఉండాలని ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. మీ దేవుడనైన యెహోవాను నేనే.”