15నరికేవాణ్ణి చూసి గొడ్డలి తన గురించి తాను ప్రగల్భాలు పలుకుతుందా? కోసేవాణ్ణి చూసి రంపం తన గురించి తాను పొగడుకుంటుందా? ఇది ఒక కర్ర తనను ఎత్తేవాణ్ణి పైకెత్తగలిగినట్టు ఉంది. ఒక గద ఒక వ్యక్తిని పైకి లేపగలిగినట్టు ఉంది.
16కాబట్టి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అష్షూరీయుల ప్రఖ్యాత యోధుల మీదకు బక్కచిక్కి కృశించిపోయే రోగం పంపిస్తాడు. వారు ఆయన మహిమ కింద అగ్ని రాజుకుని కాలిపోతారు.
17ఇశ్రాయేలు దేవుని వెలుగు ఒక అగ్ని అవుతుంది. దాని పరిశుద్ధ దేవుడు ఒక జ్వాల అవుతాడు. అది అష్షూరు దేశపు బలురక్కసి చెట్లకూ, గచ్చపొదలకూ అంటుకుని ఒక్క రోజులో వాటిని మింగేస్తుంది.
18ఒకడు వ్యాధితో క్షీణించిపోయినట్టు శరీర ప్రాణాలతోపాటు అతని అడవికీ అతని ఫలభరితమైన పొలాలకూ కలిగిన మహిమను అది నాశనం చేస్తుంది.
19అతని అడవిచెట్ల లెక్క ఎంత తగ్గిపోతుందంటే, ఒక పసివాడు వాటిని లెక్కపెట్టగలుగుతాడు.
20ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవాళ్ళు, యాకోబు కుటుంబీకుల్లో తప్పించుకున్నవాళ్ళు తమను హతం చేసిన వాణ్ణి ఇక ఎన్నడూ ఆశ్రయించకుండా ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడతారు.
21యాకోబులో మిగిలిన వాళ్ళు బలవంతుడైన దేవునివైపు తిరుగుతారు.
22ఇశ్రాయేలూ, నీ ప్రజలు సముద్రపు ఇసుకలా ఉన్నా, దానిలో మిగిలిన వాళ్ళే తిరుగుతారు. ప్రవాహంలా పారే నీతి నిర్ణయించిన ప్రకారం ఆ దేశానికి సమూల నాశనం ప్రాప్తించింది.
23ఎందుకంటే ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భూమంతటా తాను నిర్ణయించిన సమూల నాశనం అమలు చెయ్యబోతున్నాడు.