Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సంఖ్యా

సంఖ్యా 31

Help us?
Click on verse(s) to share them!
1యెహోవా “మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోండి.
2ఆ తరవాత నీవు చనిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరుకుంటావు” అని మోషేకు చెప్పాడు.
3అప్పుడు మోషే “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి పోయి వారికి యెహోవా విధించిన ప్రతిదండన చేయండి.
4ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుండి వెయ్యిమంది చొప్పున యుద్ధానికి పంపండి” అని ప్రజలతో అన్నాడు.
5ఆ విధంగా గోత్రానికి వెయ్యి మంది చొప్పున, ఇశ్రాయేలీయుల మొత్తం సైన్యంలో నుండి పన్నెండు వేల మంది యుద్ధ వీరులను సిద్ధం చేశారు.
6మోషే వారిని, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసుతో పంపించాడు. అతనికి పరిశుద్ధమైన కొన్ని వస్తువులు, యుద్ధంలో ఊదటానికి బాకాలు పంపాడు.
7యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపేశారు.
8వారు కాక మిద్యాను రాజులు, ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే ఐదుగుర్ని చంపారు. బెయోరు కొడుకు బిలామును కత్తితో చంపేశారు.
9వారు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని, వారి పశువులు, గొర్రెలు, మేకలు అన్నిటిని, వారి సమస్తాన్ని దోచుకున్నారు.
10వారి పట్టణాలు, కోటలు అన్నిటిని తగలబెట్టారు.
11వారు మనుషులను గాని పశువులను గాని మిద్యానీయుల ఆస్తి అంతటినీ కొల్లగొట్టారు.
12తరువాత వారు దానంతటినీ, చెరపట్టిన వారిని మోయాబు మైదానాల్లో యెరికో దగ్గర యొర్దాను పక్కన విడిది చేసి ఉన్న మోషే, యాజకుడు ఎలియాజరు దగ్గరికి, ఇశ్రాయేలీయుల సమాజం దగ్గరికి తీసుకు వచ్చారు.
13అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు, సమాజ నాయకులంతా విడిది బయటికి వారికి ఎదురు వెళ్ళారు.
14అప్పుడు మోషే యుద్ధం నుండి వచ్చిన సహస్రాధిపతులు, శతాధిపతుల పైన కోపపడ్డాడు.
15అతడు వారితో “మీరు మిద్యాను స్త్రీలను ఎందుకు బతకనిచ్చారు?
16బిలాము సలహా ప్రకారం పెయోరు విషయంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఎదురు తిరిగేలా చేసింది వారే కదా! అందుచేత యెహోవా మన సమాజంలో తెగులు పుట్టించాడు కదా.
17కాబట్టి మీరు మగ పిల్లలందరినీ మగవారితో సంబంధం ఉన్న ప్రతి స్త్రీనీ చంపండి.
18మగవారితో సంబంధం లేని ప్రతి ఆడపిల్లను మీ కోసం బతకనీయండి.
19మీరు ఏడు రోజులు విడిది బయట ఉండాలి. మీలో మనిషిని చంపిన ప్రతివాడూ, చనిపోయిన వారిని తాకిన ప్రతివాడూ, మీరు, మీరు చెరగా పట్టుకొచ్చిన వారు, మూడో రోజున, ఏడో రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి.
20మీరు మీ వస్త్రాలను, చర్మంతో, మేక వెండ్రుకలతో చేసిన వస్తువులను, చెక్కతో చేసిన వస్తువులను అన్నిటినీ శుద్ధి చేయాలి.”
21అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధానికి వెళ్ళిన సైనికులతో “యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
22‘అగ్నితో చెడిపోని బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, వీటితో చేసిన వస్తువులన్నిటినీ
23మంటల్లో వేసి తీయడం ద్వారా శుద్ధి చేయాలి. వాటిని పాపపరిహార జలంతో కూడా శుద్ధి చేయాలి. అగ్నితో చెడిపోయే ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయాలి.
24ఏడో రోజు మీరు మీ బట్టలు ఉతుక్కొని శుద్ధి అయిన తరవాత విడిదిలోకి రావచ్చు.’” అన్నాడు.
25యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు,
26“నువ్వూ యాజకుడు ఎలియాజరు సమాజంలోని పూర్వీకుల వంశాల నాయకులు మీరు చెరగా పట్టుకున్న మనుషులను, పశువులను లెక్కబెట్టి రెండు భాగాలు చేయండి.
27సైన్యంగా యుద్ధానికి వెళ్ళిన వారికి సగం, మిగిలిన సర్వసమాజానికి సగం పంచిపెట్టండి.
28యుద్ధానికి వెళ్ళిన సైనికులపై యెహోవా కోసం పన్ను వేసి, ఆ మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగభాగంలో నుండి తీసుకుని
29యెహోవాకు అర్పణగా యాజకుడు ఎలియాజరుకు ఇవ్వాలి.
30అదే విధంగా మిగిలిన ఇశ్రాయేలీయుల సగంలో నుండి మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో, అన్ని రకాల జంతువుల్లోనుండి 50 కి ఒకటి చొప్పున తీసుకుని యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇవ్వాలి.”
31యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా మోషే, యాజకుడు ఎలియాజరు చేశారు.
32ఆ సైనికులు దోచుకున్నది గాక మిగిలింది
336, 75,000 గొర్రెలు లేక మేకలు,
3472,000 పశువులు, 61,000 గాడిదలు,
3532,000 మంది మగవారితో సంబంధం లేని స్త్రీలు ఉన్నారు.
36అందులో సగం యుద్ధానికి వెళ్ళిన వారి వంతు, గొర్రె మేకలు 3, 37, 500. వాటిలో యెహోవాకు చెందిన పన్ను 675. పశువుల్లో సగం 36,000.
37వాటిలో యెహోవా పన్ను 72.
38గాడిదల్లో సగం 30, 500.
39వాటిలో యెహోవా పన్ను 61.
40మనుషుల్లో సగం 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32 మంది.
41యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా అతడు యెహోవాకు చెందాల్సిన అర్పణను యాజకుడు ఎలియాజరుకు ఇచ్చాడు.
42మోషే సైనికుల నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగంలో నుండి లేవీయులకు ఇచ్చాడు.
433, 37, 500 గొర్రె మేకలు,
4436,000 పశువులు, 30, 500 గాడిదలు,
4516,000 మంది మనుషులు సమాజానికి రావలసిన సగం.
46మోషే ఆ సగం నుండి మనుషుల్లో, జంతువుల్లో,
4750 కి ఒకటి చొప్పున తీసి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన విధంగా యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇచ్చాడు.
48అప్పుడు సైన్యంలో వేలమందికి, వందల మందికి అధిపతులు మోషే దగ్గరికి వచ్చి
49“నీ సేవకులైన మేము మా కింద ఉన్న సైనికులందరినీ లెక్కపెట్టాం. మొత్తానికి ఒక్కడు కూడా తగ్గలేదు.
50కాబట్టి యెహోవా సన్నిధిలో మా కోసం ప్రాయశ్చిత్తం కలిగేలా మాలో ప్రతి ఒక్కడికి దొరికిన బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకాలు యెహోవాకు అర్పణ తెచ్చాం” అని చెప్పారు.
51మోషే, యాజకుడు ఎలియాజరు ఆ బంగారు నగలను వారి నుండి తీసుకున్నారు.
52వేలమందికి, వందల మందికి అధిపతులైన నాయకులు యెహోవాకు అర్పించిన బంగారం మొత్తం 16, 750 తులాలు.
53ఆ సైనికుల్లో ప్రతివాడూ తన మట్టుకు తాను దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు.
54అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు వేలమందికి, వందల మందికి అధిపతుల దగ్గర తీసుకున్న బంగారాన్ని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారంలో ఉంచారు.